హైదరాబాద్కు చేరిన కన్నడ రాజకీయం
హైదరాబాద్ తాజ్ కృష్ణకు కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ షిఫ్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 100 మంది ఎమ్మెల్యేలకు ఏం కావాలన్నా.. ఏం అవసరం వచ్చినా చూసుకోవటానికి, వారికి వసతులు కల్పించటానికి తెలంగాణ కాంగ్రెస్ యూత్ విభాగం చురుగ్గా పని చేస్తోంది. మొదట పార్క్ హయత్ హోటల్ చేరుకున్నా.. అక్కడ గదులు ఖాళీ లేకపోవటంతో.. అప్పటికప్పుడు తాజ్ కృష్ణ హోటల్ కు క్యాంప్ షిఫ్ట్ అయ్యింది.
బీజేపీ ఆపరేషన్ కమల్.. ఇప్పుడు హైదరాబాద్ పై పడింది. తాజ్ కృష్ణలో బస చేసిన కర్నాటక కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లటానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ నేతలతో అధిష్టానం పెద్దలు కూడా మాట్లాడినట్లు సమాచారం. క్యాంప్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది.. అక్కడి పరిస్థితులు ఏంటీ అనేది అడిగి తెలుసుకుంటోంది. బెంగళూరులో రిసార్ట్ దగ్గర సెక్యూరిటీ తొలగింపు తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎమ్మెల్యేలను షిఫ్ట్ చేసింది. దీంతో ఇప్పుడు బీజేపీ చూపే కాదు.. మొత్తం దేశం చూపు హైదరాబాద్ సిటీ వైపు పడింది..