101 నదుల్లో జల రవాణా!

న్యూఢిల్లీ: దేశంలో జల రవాణాను ప్రోత్సహిస్తే అది ప్రజా ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా 101 నదులను జల రవాణా మార్గాలుగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి  గడ్కారీ వెల్లడించారు. నదులను జల మార్గాలుగా మార్చాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. కిలోమీటర్ ప్రయాణానికి రోడ్డు మార్గంలో రూ.1.50 ఖర్చు అవుతుందని, జల రవాణాలో అయితే అర్ధరూపాయే ఖర్చవుతుందన్నారు.

ఈ నేపథ్యంలో ‘ప్రధానమంత్రి జల్ మార్గ్ యోజన’ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, నదీమార్గాలను జల మార్గాలుగా మార్చడంతోపాటు డ్రై, శాటిలైట్ ఓడరేవులను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని గడ్కారీ వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు జాతీయ జలమార్గాల్లో గంగా-భగీరథీ-హుగ్లీ నదీ వ్యవస్థ (అలహాబాద్-హల్దియా-1,620 కి.మీ.), బ్రహ్మపుత్ర నది (ధుబ్రీ-సదియా-891 కి.మీ.), ఉద్యోగ్‌మండల్-చంపకర కెనాల్స్‌లోని పశ్చిమ తీర కెనాల్ (కొట్టాపురం-కొల్లామ్-205 కి.మీ.), కాకినాడ-పుదుచ్చేరి కెనాల్స్ (గోదావరి-కృష్ణా నదులు 1,078 కి.మీ.), బ్రహ్మపుత్ర-మహానదిలోని తూర్పు తీర కెనాల్ (588 కి.మీ.) ఉన్నాయి.