హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తయారు చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావు చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐటీ అసోసియేషన్‌ అవగాహన సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. హైదరాబాద్‌తో పాటు దేశంలో అనేక ఐటీ హబ్బలు అభివృద్ధి చెందాయని, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పదింతలు అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ వల్లే చంద్రబాబు డెవలప్‌ అయ్యిండని తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు రెండు ఎకరాలున్న చంద్రబాబుకి ఇప్పుడు హైటెక్‌ సిటీ ఎదుట 15 ఎకరాల ఫాంహౌస్‌ ఉన్నదని తెలిపారు. చంద్రబాబు సిగ్గుమాలిన నేత అని విమర్శించారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు సమైక్యవాదులు కాదు అవకాశవాదులు అని చెప్పారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ జై తెలంగాణ అనడం తప్పయితే… డ్యూటీలో ఉన్న సీఎం కిరణ్‌ జై సమైక్యాంధ్ర ఎట్ల అంటారు. అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తప్పుబట్టినా డీజీపీ దినేష్‌రెడ్డి పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంత వరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమొద్దు అని సూచించారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తే సీమాంధ్ర నేతలతో చర్చలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.