ఉత్తరప్రదేశ్లో మ‌ళ్లీ ఘోరం

hj7xf4t8

స్కూలు టీచర్పై సామూహిక అత్యాచారం, దోపిడీ

 మైన్పురి : ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లామధు ప్రాంతంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమె వద్ద ఉన్న ఆభరణాలను దోచుకున్నారు. ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. భాంగావ్ పోలీసు సర్కిల్ పరిధిలోని నగ్లా మధు ప్రాంతంలోని పాఠశాలలో పనిచేస్తున్న బాధితురాలు స్కూలుకు నడిచి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను దారికాచి ఆమె వద్ద ఉన్న బంగారు గొలుసు, 5వేల రూపాయల నగదు దోచుకోడానికి ప్రయత్నించారు.

ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రోడ్డుపక్క పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై ఆ ముగ్గురూ అత్యాచారం చేశారని జిల్లా ఎస్పీ శ్రీకాంత్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న సొత్తును కూడా దోచుకున్నారు. నిందితుల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని, మరో ఇద్దరు మాత్రం పారిపోయారని ఎస్పీ చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామన్నారు.