కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
మంచి జీతం, మెరుగైన భవిష్యత్తు ఆశతో విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువకులే లక్ష్యంగా సాగుతున్న అంతర్జాతీయ మోసాలకు అద్దం పట్టే దారుణ ఉదంతమిది. మయన్మార్లోని కొన్ని నకిలీ ఐటీ కంపెనీలు, ఉద్యోగాల పేరిట భారతీయులను అక్రమంగా తరలించి, వారిచేత బలవంతంగా ఇంటర్నెట్ మోసాలకు పాల్పడేలా చేస్తున్నాయి. మాట వినని వారిని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేని వారిని అమానుష చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వారం రోజుల పాటు ఫ్రిజ్లో ఉంచిన, కుళ్లిపోయిన బాతు గుడ్లను బలవంతంగా తినిపించడం, నిరాకరించిన వారికి కరెంట్ షాకులు ఇవ్వడం వంటి పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోయారు.ఇటీవల మార్చి నెలలో, భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని, మోసపూరిత ఏజెంట్ల బారిన పడి మయన్మార్లో చిక్కుకున్న 540 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించింది. బాధితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు వంటి పలు రాష్ట్రాలకు చెందినవారున్నారు. వీరిలో 65 మంది, తాము పనిచేస్తున్న ఓ కంపెనీలో నిరంతర వేధింపులు తాళలేక సమ్మెకు దిగారు. మార్చి 11, 12 తేదీల్లో ఢిల్లీకి చేరుకున్న అనంతరం వారు సీబీఐ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మయన్మార్లోని మయావడి ప్రాంతంలో తమను ఎలా నియమించుకున్నారు, అక్కడికి ఎలా తరలించారు, ఎలాంటి చిత్రహింసలకు గురిచేశారో వివరించారు.బాధితుల్లో ఒకరైన కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, రంగంపేటకు చెందిన కొక్కిరాల మధుకర్ రెడ్డి (31) తన అనుభవాలను ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. 2024 డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లిన తనను, అక్కడి నుంచి మంచి ఐటీ ఉద్యోగం పేరుతో మయావడికి అక్రమంగా తరలించారని తెలిపారు. “శిక్షణ సమయంలోనే మా చేత అమెరికాలోని ప్రవాస భారతీయులను (ఎన్నారై) మోసం చేయించి, ఉనికిలో లేని కంపెనీలలో పెట్టుబడులు పెట్టించాలని చూస్తున్నారని అర్థమైంది” అని మధుకర్ రెడ్డి పేర్కొన్నారు. “నేను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్లు పూర్తి చేయకపోవడంతో నన్ను చాలాసార్లు శిక్షించారు. ఆ భయంకరమైన కుళ్లిన బాతు గుడ్లను చాలాసార్లు తినాల్సి వచ్చింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.