ఆచార్య జయశంకర్కు ఘన నివాళి..

కలెక్టరేట్లో జయంతి వేడుకలు
ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ బ్యూరో అగస్ట్ 06 (జనం సాక్షి ): మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని శాస్త్రీయంగా, చారిత్రకంగా దేశానికి చాటిచెప్పి, ఉద్యమానికి భావజాలాన్ని అందించిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలు, త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. సమాజ అభ్యున్నతి, ప్రాంతీయ సమాన అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఆయన నిరంతరం పాటుపడ్డారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి నిర్మలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.



