పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయండి

ప్రజల అభిప్రాయాలను పరిగణించి గౌరవించండి

ఇథనాల్‌ పాలసీ విషయంలో ప్రభుత్వం సమీక్షించాలి

రైతులపై హత్యాయత్నం కేసులు సహా అన్ని కేసులను ఉపసంహరించాలి

ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, పలు ప్రజాసంఘాల డిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి)
కాలుష్యం వెదజల్లే ఇథనాల్‌ భూతంపై సర్వత్రా వ్యతిరేకతలు కొనసాగుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా గతంలో, ఇటీవల ఇథనాల్‌ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలు కొనసాగిన దరిమిలా పెద్దధన్వాడలో కూడా ప్రజల నుంచి ప్రతిఘటన తప్పలేదు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెడితే ఊరుకునేది లేదని ముందునుంచీ భీష్మించిన స్థానిక జనం.. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకూ వెనక్కి తగ్గలేదు. నీరూ, నేల, గాలి, భూములు కలుషితమైపోతాయని మూకుమ్మడిగా కొట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇథనాల్‌ ఫ్యాక్టరీల విషయంలో ప్రజాపాలనలో న్యాయం జరుగుతుందని భావించిన పెద్దధన్వాడ, చుట్టుపక్కల గ్రామాలవాసులకు నిరాశ తప్పలేదు. దిలావర్‌పూర్‌ మాదిరి ప్రకటన వస్తుందేమోనని ఆశించినవారిపై ఫ్యాక్టరీ యాజమాన్యం బలప్రయోగం చేయడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఎలాంటి గ్రామసభలు పెట్టకుండా గాయత్రి రెన్యువబుల్‌, ఫ్యూయల్‌, ఆలివ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గతేడాది అక్టోబర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని గమనించిన పెద్దధన్వాడ సహా చుట్టుపక్కల సమీప గ్రామాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలోనే దిలావర్‌పూర్‌లో పెద్దఎత్తున ప్రజాగ్రహం వ్యక్తమై ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రకటన చేసింది. గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఇచ్చిన అనుమతుల ప్రతులను సీఎం రేవంత్‌ సర్కార్‌ బయటపెట్టింది. ఫ్యూయల్‌ సాకుతో పెట్టుబడిదారుల అనుకూల నిర్ణయాలు ఇచ్చారని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీలు అడ్డదారులు అనుసరించాయని సర్కార్‌ కుండబద్దలు కొట్టింది. ఓ సందర్భంలో కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించబోమని సీఎం రేవంత్‌ రెడ్డి సైతం అఖిలపక్ష నేతలకు హామీనిచ్చారు. దీంతో పెద్దధన్వాడవాసుల్లోనూ తమ గ్రామంలోని ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దవుతుందని భావించినప్పటికీ.. ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వంద్వం వైఖరి వల్ల గత బుధవారం జనాగ్రహం పెల్లుబికింది.

గ్రామసభ లేదూ.. ప్రజామోదం లేదు..

భూసేకరణ మొదలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాలనుకునే ఫ్యాక్టరీలకు కచ్చితంగా గ్రామసభ ఆమోదం తెలపాలి. కానీ పెద్దధన్వాడలో అలాంటి చర్యలేవీ జరగలేదు. ప్రజామోదం లేకుండా ఫ్యాక్టరీ పనులకు దిగడం, ప్రైవేటు సైన్యంతో రెచ్చగొట్టడం మూలంగా నేడు 40మంది రైతులు, ఘటనా స్థలంలో లేనివ్యక్తులు కూడా యాజమాన్యం తప్పుడు ఫిర్యాదుతో కేసులెదుర్కొంటున్నారు. యాజమాన్యం వ్యక్తులపైగానీ, వారి ప్రైవేటు సైన్యంపైగానీ ప్రజలు దాడి చేసి గాయపరచకపోయినా పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే 12 మంది జైలు పాలవగా.. గ్రామస్తులను కొందరు పోలీసులు అత్యుత్సాహంతో భయాందోళనకు గురిచేస్తున్నట్టు ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వైఖరిని ప్రజాస్వామికవాదులు, పలు ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తెలంగాణలో ఇథనాల్‌ పాలసీని సమీక్షించడంతో పాటు రైతులపై కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఫ్యాక్టరీని నిలిపేసేలా ఆదేశాలివ్వాలి : ప్రొఫెసర్‌ హరగోపాల్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇథనాల్‌ పాలసీ విషయంలో సమీక్షించాలి. రాష్ట్రంలో ఇథనాల్‌ కంపెనీలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి. స్థానికులతో చర్చించకుండా, వారి ఆమోదం లేకుండా ఫ్యాక్టరీ పెట్టడం అప్రజాస్వామికం. బలవంతంగా నిర్మాణానికి దిగడం వల్ల రైతులు తిరగబడ్డారు. వారిపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. హత్యాయత్నం కేసులు సహా అన్ని సెక్షన్లను ఎత్తివేయాలి.

పోలీసు దూకుడు చర్యలను ఖండిస్తున్నాం : విరాహత్‌ అలీ, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు

ఇథనాల్‌ యాజమాన్యం తన పెట్టుబడిదారీ స్వభావాన్ని అక్రమ కేసుల ద్వారా నిరూపించుకుంటుంది. దీన్ని పూర్తిగా జర్నలిస్టులే కాదు ప్రజాస్వామికవాదులు, పౌరసమాజం ఖండిరచాలి. పోలీసుల దూకుడు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. పోలీసులు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ ఇలాంటి దోరణిని అవలంభిస్తున్నట్టు అర్థమవుతోంది. ఏకపక్షంగా ఈ కేసును నిర్వహించడం సహించరానిది. సమాజానికి ఇలాంటి సంకేతాలు మంచివి కావు. మా సంఘం ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్యమాలు చేపడుతోంది. దీన్ని రాష్ట్రస్థాయిలో ఉధృతం చేస్తాం. రైతులకు అండగా ఉండటంతో పాటు జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌కు పూర్తిగా అండగా ఉంటాం.

హత్యాయత్నం కేసు సమంజసం కాదు : అల్లం నారాయణ, టీజేఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు

ఘటనా స్థలంలో లేనివారిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. జనంసాక్షి ఎడిటర్‌ ప్రజల ఆందోళన కొనసాగుతున్నప్పుడు అక్కడ లేకపోయినప్పటికీ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సమంజసం కాదు. దీన్ని ప్రజాస్వామికవాదులు సహా ప్రతి ఒక్కరూ ఖండిరచాలి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేసు ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలి.

లేనివారిపై కేసు నమోదు విచిత్రం : విజయ్‌కుమార్‌ రెడ్డి, సాక్షి రెసిడెంట్‌ ఎడిటర్‌

సంఘటనా స్థలంలో లేనివ్యక్తులపై కేసు పెట్టడం విచిత్రం. ఇది భయభ్రాంతులకు గురిచేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి చర్యలు తెలంగాణ సమాజానికి మంచిది కాదు. వెంటనే కేసులు విత్‌ డ్రా చేసుకోవాలి. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై యాక్షన్‌ తీసుకోవాలి.

ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి : మామిడి సోమయ్య, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

పర్యావరణానికి నష్టం కలిగించే ఇథనాల్‌ ఫ్యాక్టరీ విషయంలో యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. వారి తప్పుడు ఫిర్యాదు కారణంగా రైతులపై, జనంసాక్షి ఎడిటర్‌పై పోలీసులు కేసులు పెట్టారు. యాజమాన్యం మనుషులకుగానీ, వారి సిబ్బందికిగానీ ఎలాంటి హానితలపెట్టకపోయినా హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. బాధ్యతాయుతమైన పత్రికా ఎడిటర్‌ కేసు పెట్టడం అన్యాయం. ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలని టీడబ్ల్యూజేఎఫ్‌ తరపున డిమాండ్‌ చేస్తున్నాం.

సర్కారు, కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి : ఎన్‌ వేణుగోపాల్‌, వీక్షణం ఎడిటర్‌

ఎనిమిది నెలల శాంతియుత పోరాటం, అనేక విజ్ఞప్తులు, రాజకీయ నేతల జోక్యంతో వచ్చిన హామీల తర్వాత ప్రజాగ్రహం వ్యక్తమైంది. దీనికి సర్కారు, కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఇలాంటి సందర్భంలో కేసులు పెట్టడం అన్యాయం. జర్నలిస్టుపై నమోదు చేయడం మరీ దారుణం. ఈ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వమని నిరూపితమైంది. జర్నలిస్టులు ప్రజాగ్రహాన్ని, ప్రజామద్దతును వార్తల రూపంలో మాత్రమే తెలియజేస్తారు. ఉద్యమ నాయకుడిపై ఏ2గా కేసు చూపెట్టడం అక్రమం. వెంటనే ఉపసంహరించుకోవాలి. జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు చేయబోమని సర్కారు వాగ్దానం చేయాలి.

తాజావార్తలు