పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
మంథని, (జనంసాక్షి) : పోలీసుల సంక్షేమానికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లలకు ప్రత్యేకంగా స్కూల్ ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుంది. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిది. వారి త్యాగాలకు మనం వెల కట్టలేం. మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి కారణం పోలీసులే. వారి కోసం మనమేం చేసిన తక్కువే. రాబోయే పదేళ్లలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దేశంలోనే అత్యుత్తమ స్కూల్స్ లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కు ధీటుగా ఈ పాఠశాలను తీర్చి దిద్దుతాం. ఇక్కడ చదువుకునే విద్యార్థులను అకడమిక్స్ తో పాటు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తాం. హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు అందరికీ ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించాం. విద్య, వైద్యంపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతాం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో చదివే విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దుతాం. ఈ స్కూల్ నిర్మాణానికి ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు. వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్కూల్ నిర్వహణలో అందర్నీ భాగస్వామ్యం చేసి… గొప్ప స్కూల్ గా తీర్చి దిద్దుతాం అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.