అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆగకూడదు

పెద్దపల్లి, మే 06:
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు – తడిసిన ధాన్యాన్ని తిరస్కరించవద్దు
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు, వర్షాల ప్రభావంపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలో రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆ ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడానికి ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ ఎక్కడా ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి సమీప పీపీసీ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తగినంత తార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని వినియోగించుకోవాలని అన్నారు.రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, ప్రతి ధాన్య గింజ కొనుగోలు చేయబడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ టెలీ కాన్ఫరెన్స్లో డిసిఓ శ్రీ మాల, డీఎం సివిల్ సప్లై శ్రీకాంత్, డీఎస్ఓ శ్రీనాథ్, డి ఎం ఓ ప్రవీణ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


