గ్యారెంటీ స్కీమ్‌లు: కర్ణాటక ముఖ్యమంత్రి సలహాదారు సూచన!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు అనర్హులు కూడా ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను సమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బసవరాజ్ రాయరెడ్డి ఇటీవల తన నియోజకవర్గమైన కొప్పళ జిల్లాలోని యలబుర్గాలో జరిగిన గ్యారెంటీల సమీక్షా అంతర్గత సమావేశంలో ఈ ఆందోళనలను వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు వంటి అనర్హులకు గ్యారెంటీ పథకాల ప్రయోజనాలను నిలిపివేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ఈ పథకాలు అర్హులైన పేదలకు మాత్రమే అందాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన సూచించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గ్యారెంటీ పథకాలపై బీజేపీ పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజా పరిణామాలతో ఈ అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అనర్హులను గుర్తించి వారికి పథకాలను నిలిపివేసే ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజావార్తలు