ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.ఇటీవల భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మందకృష్ణ మాదిగను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని ప్రస్తావించారు.అనంతరం, ఇరువురు నేతలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రస్థానం గురించి చర్చించుకున్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలోని కీలక ఘట్టాలను, ఎదురైన సవాళ్లను, గత అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. వర్గీకరణ సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆనాటి పరిస్థితులపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.