పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామన్న మోదీ
పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ దాడిలో తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో గట్టి సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు మన దేశాన్ని విభజించాలని చూశారని, మతం పేరుతో పాకిస్థాన్ విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అయితే, భారతీయులంతా ఐక్యంగా నిలిచి వారి కుట్రలను తిప్పికొట్టారని, పాక్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశామని గుర్తు చేశారు.సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. వాస్తవానికి ఆయన సిక్కింలో నేరుగా పర్యటించాల్సి ఉన్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ పర్యటన రద్దయింది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.సిక్కిం రైతులు వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఇది రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిక్కిం ప్రజలకు ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.