నల్లగొండ ఆర్టీసీ డిపోలో అధికారుల ఇష్టారాజ్యం

 

 

 

 

బస్సులే కాదు.. అధికారులు కూడా సమయానికి రావట్లేదు..

నల్లగొండ ప్రతినిధి, మే 19,(జనం సాక్షి):

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో అధికారుల పని తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది.ప్రజలకు సమయపాలనపై అవగాహన కల్పించాల్సిన అధికారులే కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.డిపోలో “ఆడిందే ఆట.. పాడిందే పాట” అన్నట్టుగా కొంతమంది అధికారుల వ్యవహారం కొనసాగుతోందని తెలుస్తుంది.విధి సమయానికి హాజరు కాకపోయినా, వచ్చిన తర్వాత మాత్రం రిజిస్టర్‌లో సంతకాలు చేసి విధుల్లో ఉన్నట్లు చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా డిపో డిప్యూటీ సూపరిండెంట్ సమయపాలనను పూర్తిగా గాలికి వదిలేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.డ్యూటీ టైం ఒకటైతే, మేడమ్ వచ్చే సమయం మరోలా ఉంటోందని, ఇదే తంతు ప్రతిరోజూ కొనసాగుతోందని డిపో వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సమయానికి రాకపోవడంపై జనం సాక్షి ప్రశ్నిస్తే “నా ఇష్టం… ఎప్పుడైనా వస్తా… మీకెందుకు..?” అని దురుసు అయిన సమాధానం వచ్చింది.ఆమె ప్రతి రోజు అలానే వస్తుంది అని ఆరోపణలు పరిస్థితి తీవ్రతను బయటపెడుతున్నాయి.సాధారణ ఉద్యోగులపై కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు తమ విషయంలో మాత్రం నియమాలను పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రభుత్వం భారీ జీతాలు చెల్లిస్తుంటే ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. జీతాలు ఫుల్… పనులు నిల్ అన్నట్టుగా డిపో పరిస్థితి మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిపోలో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ అమలు చేస్తారా..? లేక ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారా..? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రయాణికుల్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రజలకు సమయానికి బస్సులు అందించాల్సిన ఆర్టీసీ డిపోలోనే సమయపాలన లేకపోతే సాధారణ ప్రజలు ఎవరిని నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి డిపోలో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.