భారత్లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్లామిక్ పండితులు ఇక్కడ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. “మేము ముస్లిం దేశం, భారతదేశం కాదంటూ పాకిస్థాన్ అరబ్ ప్రపంచానికి, ముస్లిం దేశాలకు తప్పుడు సందేశం ఇవ్వడం అత్యంత దురదృష్టకరం. భారతదేశంలో 24 కోట్ల మంది గర్వపడే భారతీయ ముస్లింలు నివసిస్తున్నారు.పాకిస్థాన్ సైనిక శక్తి గురించి ఆ దేశం చేస్తున్న ప్రగల్భాలను కూడా ఒవైసీ తోసిపుచ్చారు. “మే 9న ఏం జరిగింది? వారి తొమ్మిది వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నాం. భారత్ తలచుకుంటే ఆ వైమానిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయగలిగేది. కానీ, ‘మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అలా చేయకండి, మమ్మల్ని ఆ మార్గంలోకి నెట్టకండి’ అని వారికి చెప్పాలనుకున్నాం. మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, హతమైన ఉగ్రవాదులకు నమాజ్ చేయించిన వ్యక్తి అమెరికాచే గుర్తించబడిన ఉగ్రవాది” అని ఒవైసీ వివరించారు.