భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
పాకిస్థాన్ (జనంసాక్షి): ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ తో పాక్ పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఇన్నాళ్లూ తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న పాక్.. తాజాగా దాన్ని అంగీకరించింది.ఆపరేషన్ సిందూర్లో భాగంగా తమ కీలక సైనిక స్థావరాలపై భారత్ దాడులు నిజమే అని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా వెల్లడించారు. రెండు కీలక ఎయిర్బేస్లపై భారత్ దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, షోర్కోట్ వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల అనంతరం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు సౌదీ అరేబియా రంగంలోకి దిగిందని కూడా దార్ ఈ సందర్భంగా వెల్లడించారు. జియో న్యూస్తో ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ‘మేము తిరిగి దాడి చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. భారత్ చాలా వేగంగా స్పందించింది’ అని తెలిపారు. భారత్ దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ తనను వ్యక్తిగతంగా సంప్రదించారని దార్ ఈ సందర్భంగా వెల్లడించారు. సౌదీ యువరాజు తనను ఫోన్లో సంప్రదించినట్లు చెప్పారు. ‘పాకిస్థాన్ దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు తెలియజేయవచ్చా’ అని తనని అడిగినట్లు దార్ వివరించారు.