జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్

అమరావతి: ‘మాస్క్‌ అడిగారని డా.సుధాకర్‌ను, జే బ్రాండ్‌ దోపిడీని ప్రశ్నించారని ఓం ప్రతాప్‌ను, గంజాయి మాఫియా గుట్టురట్టు చేస్తాడని డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని, ఓట్ల కోసం సొంత బాబాయి వివేకానందరెడ్డిని..ఇలా మీ పాలనలో ఎంతో మందిని దారుణంగా చంపారు కదా.. వారి పేర్లు చెప్పాల్సింది.. జగన్‌’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. 36 మందిని చంపేశారని చెబుతున్న జగన్‌..వారి పేర్లు వెల్లడించాలని జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘దిల్లీలో చిరునవ్వుతో ధర్నా చేసిన జగన్‌రెడ్డిని మృతుల పేర్లు చెప్పమని జాతీయ మీడియా అడిగింది. ఒక్కరి పేరైనా చెప్పొచ్చు కదా.. మీ పాలనలో ఎంతో మందిని చంపారు కదా.. వారి పేర్లు చెప్పాల్సింది’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా లోకేశ్‌ పేర్కొన్నారు.