వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ను యధాతధంగా కొనసాగించాలి
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
హయత్ నగర్, మే 13 (జనం సాక్షి)ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ను సచివాలయంలో ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పుడు నిర్ణయాలు మానుకోవాలి అని అన్నారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ను, మహేశ్వరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు అప్పగించే ప్రతిపాదనతో పాటు, అక్కడి రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇతర ఆసుపత్రులకు బదిలీ చేసే ప్రక్రియ లపై ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ పరిసర కాలనీలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కీలక వైద్య సేవలు అందిస్తున్న ముఖ్య కేంద్రంగా కొనసాగుతోందని తెలియజేశారు. ఆసుపత్రి మార్పు లేదా సిబ్బంది బదిలీల వల్ల స్థానిక ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ను కొనసాగించాలని మంత్రి ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ మాట్లాడుతూ హాస్పిటల్, సిబ్బంది విషయంలో అధికారులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ భారస అధ్యక్షులు చింతల రవికుమార్, బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారస పార్టీ యూత్ అధ్యక్షులు రవిముదిరాజ్, మధుసాగర్, ఏరియా హాస్పిటల్ సిబ్బంది శివకుమార్, గఫర్, తదితరులు పాల్గొన్నారు.



