టిడిపికి గుడ్‌బై చెప్పిన రేవంత్‌

పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా

రేవంత్‌తో చర్చించని బాబు

హైదరాబాద్‌కు రేవంత్‌ తిరుగు ప్రయాణం

అమరావతి,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): అంతా ఊహించినట్లుగానే, ముందుగా అనుకున్నట్లే జరిగింది. తెలుగుదేశం పార్టీకి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి గుడ్‌బై చెప్పారు. శనివారం విజయవాడలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన పదవులతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేవంత్‌ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి అందచేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రేవంత్‌ రెడ్డి మౌనంగా బయటకు వెళ్లిపోయారు. విూడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేందర్‌ రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. వీరు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్టపికే రాహుల్‌తో భేటీ అయిన రేవంత్‌ అనేక విషయాలపై చర్చించారని తెలుస్తోంది. అయితే పార్టీలో వ్యవహారాలపై విజయవాడలో చర్చిద్దామని పిలిచిన టిడిపి అధినేత చంద్రబాబు అసలు రేవంత్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా కలవడానికి కూడా ఇష్టపడలేదని సమాచారం. దీంతో బాబు పిలుపుకోసం వెయిట్‌ చేసిన రేవంత్‌ ఇక లౄబం లేదనుకుని రాజీనమాను బాబు వ్యక్తిగ కార్యదర్శికి ఇచ్చి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని, అయితే టీడీపీతో పాటు అధ్యక్షుడిపైనా తనకు ఎంతో గౌరవం ఉందని రేవంత్‌ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీలో తన ఎదుగుదలకు చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. ఓ వైపు తాను టీఆర్‌ఎస్‌తో పోరాడుతుంటే…మరోవైపు తమ పార్టీ నేతలు వారితో స్నేహం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండాలని ప్రకటనలు చేస్తున్నారని, వారిని చంద్రబాబు ఎందుకు నివారించలేకపోతున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక తాను టీడీపీలో కొనసాగలేనని, అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా కొడంగల్‌లో పార్టీ శ్రేణులతో మాట్లాడిన అనంతరం రేవంత్‌ తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలావుంటే గతరెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు శుక్రవరాం లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో పార్టీనేతలతో సమావేశం అయ్యారు. చర్చను అర్థంతరంగా ముగించి విజయవాడకు వెళ్లిపోయారు. శనివారం టిడిపి తెలంగాణ నేతలను విజయవాడకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే వ్యవహారాలను ముందే గమనించిన బాబు ఇక రేవంత్‌తో మాట్లాడేదేవిూ ఉండదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెదేపాకు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరనున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన తెదేపాను వీడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రేవంత్‌ రెడ్డి వ్యవహారాన్ని సొంత పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్‌ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చించేందుకు తెలంగాణ తెదేపా నేతలు ఇవాళ విజయవాడకు చేరుకున్నారు. వారితోపాటు రేవంత్‌ కూడా విజయవాడ వచ్చారు.

నేపథ్యంలో ఆయన పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ అధినేతకు లేఖ రాశారు. ఇటీవల దిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని రేవంత్‌ కలిశారని.. ఆ పార్టీలో త్వరలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.