తెలంగాణలో కొనసాగుతోన్న ‘ పల్లెబాట’

హైదరాబాద్‌: టీఎర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ పల్లెబాట’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. గత ఐదు రోజులుగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, పలువురు తెలంగాణ వాదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పల్లెపల్లెన జై తెలంగాణ నినాదాలతో మారుమోగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి పల్లె ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ పల్లెబాట

మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరి, మరికల్‌లలో టీఆర్‌ఎస్‌ పల్లెబాట కార్యక్రమం కొనసాగింది. ఈకార్యక్రమంలో పలువురు తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు.

మహబూబ్‌నగర్‌ శ్రీనివాస్‌ కాలనీలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం చేపట్టారు. పలువురు జేఏసీ నేతలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఈ బస్తీబాటలో పాల్గొన్నారు.

జడ్చర్ల బస్తీబాట

జడ్చర్ల పట్టణంలో టీఆర్‌ఎస్‌ బస్తీబాట నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మాణ్‌రెడ్డితోపాటు పలువురు తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొని జైతెలంగాణ నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు.

వరంగల్‌ పల్లెబాట

పట్టణ పశ్చిమ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు పేర్వారం రాములు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులు పాల్గొన్నారు.

చెన్నారావుపేట పల్లెబాట

చెన్నారావుపేటలో పల్లెబాట కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ది సుధర్శన్‌రెడ్డి, ఇతర తెలంగాణవాదులు హాజరయ్యారు.

కరీంనగర్‌ పల్లెబాట

జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పలు పట్టణాలు, గ్రామాలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. కోనరావుపేట మండలం తిమ్మాపల్లిలో టీఆర్‌ఎస్‌ పల్లెబాట నిర్వహించింది. ఈకార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుతో పాటు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌  కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పల్లెబాట

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గం పల్లెబాట కార్యక్రమంతో పట్టణం గులాబీమయమైంది. ఈ కార్యమ్రంలో పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.