తెలంగాణ రాష్ట్ర సాధనే జయశంకర్‌సార్‌కు నిజమైన నివాళి

తెలంగాణ తేల్చనపుడు రాష్ట్రపతి ఎన్నికల్లో
టీడీపీ, కాంగ్రెస్‌లు ఎందుకు పాల్గొంటున్నాయి : కోదండరామ్‌గన్‌పార్క్‌ వద్ద రాజకీయ జేఏసీ జయశంకర్‌ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించి తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ,జయశంకర్‌ ఆలోచనలు స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేయటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం అని కాంగ్రెస్‌ ,టిడిపి ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర్రపతి ఎన్నిక సందర్బంగా తెలంగాణ అంశాన్ని ఒక అవకాశంగా తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఎటూ తేల్చనప్పుడు కాంగ్రెస్‌,టీడీపీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర్రపతి ఎన్నికలో ఎందుకు పాల్గొంటున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పై తేల్చకుండా ఎన్నికల్లో పాల్గొనమని కేంద్రానికి నాయకులు స్పష్టం చేయాలని ఆయన సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకే ప్రధానమైన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు రాజీనామాలు చేయకపోయినా, పదవులు వీడకపోయినా ఫరవాలేదని,ఈ సందర్భంగానైనా ఉపయోగించుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోదండరాం అన్నారు.