బీమా కంపెనీలకు కలెక్టర్‌ హెచ్చరికలు

గుంటూరు: అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులకు నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు తాత్సారం చేస్తుండటంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల బాధిత మిర్చి రైతులు నేషనల్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించి 10గంటలపాటు ఉద్యోగులను నిర్భందించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఈరోజు రైతుల ప్రతినిధులు, బీమా కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులనుంచి ప్రతి బస్తాకు ప్రీమియం వసూలు చేస్తున్న బీమా కంపెనీలు ప్రమాదం జరిగితే నష్టపరిహరం చెల్లించే విషయంలో ఎందుకంత వెనుకడుగు వేస్తున్నాయని ఆయన నిలదీశారు. పరిహహారం చెల్లించటంలో జాప్యాన్ని సహించమని అన్నారు. బాధిత రైతులు, రైతు ప్రతినిధులు కూడా కంపెనీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కలెక్టర్‌కు తమ ఇబ్బందులు తెలియజేశారు. దీంతో ఆయన సాధ్యమైనంత త్వరగా పరిహారం ఇప్పిస్తానని హామి ఇచ్చారు.