సిరియాలో 200 మంది వూచకోత

బీరుట్‌: హమా ప్రాంవతంలోని ట్రెమ్‌సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని వివరించాయి. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత కోఫీ అన్నన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండించారు. సిరియా ప్రభుత్వ టెలివిజన్‌ మాత్రం ట్రెమ్‌సేలో అల్లర్లు చెలరేగాయని, సాయుధ ఉగ్రవాద బృందాలు ఊచకోతకు తెగబడ్డాయని వెల్లడించింది. ఈ దాడుల్లో ముగ్గురు సైనికులు కూడా చనిపోయారని పేర్కొంది. ఈ ప్రాంతంలో గురువారం నుంచి ఆగకుండా జరుగుతున్న పోరాటానికి సంబంధించిన నిజానిజాలను ధ్రువీకరించేందుకు అక్కడికి వెళ్తామని ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల బృందం నేత రాబర్ట్‌ మూడ్‌ తెలిపారు.