హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు పెంపు

కేంద్రం ముందు ప్రతిపాదనలు
కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ వెల్లడి
బెంగుళూర్‌: హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన కేంద్రం ముందున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుషీద్‌ తెలిపారు. శనివారం ఇక్కడ కర్ణాటక న్యాయ సేవా ప్రాధికార నిర్వహించిన ఒక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు, సుప్రీం కోర్టు జడ్జిల రిటర్మెంట్‌ వయస్సుతో సమానంగా ఉండాలనే ప్రతిపాదన ఉన్నాయన్నారు. న్యాయ విశ్వ విద్యాలయాలు, న్యాయ కళాశాలలు నిపుణులైన న్యాయ కోవిదులను రూపొందించాలని సూచించారు. న్యాయమూర్తులు విదేశి యాత్రలకు వెళ్లినపుడు అక్కడి న్యాయవ్యవస్థను అధ్యయనం చేయాలని సూచించారు. న్యాయమూర్తుల ఎంపిక కోసం ప్రత్యేక కమీషన్‌ ఏర్పాటు చేస్తామని చెబుతూ , దీనిపై కొన్ని అభ్యంతరాలు రావడంతో ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. గ్రామ న్యాయస్థానాల సంఖ్యను పెంచుతామని ఇప్పటి వరకు 165 గ్రామ న్యాయస్థానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్‌ మాట్లాడుతూ రాజీ ద్వారా కొన్ని కేసుల్ని పరిష్కరించవచ్చని ఇందుకోసం ప్రత్యేక రాజీ స్థానాలపై కేసుల విచారణల ఒత్తిడి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివం, హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.