అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ
– ఇదే చివరి అవకాశం
– మంత్రి తలసాని
హైదరాబాద్, నవంబర్ 2 (జనంసాక్షి):
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అమలుకు అనుమతిచ్చింది. ఈమేరకు హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విూడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 28 వరకు నిర్మించిన భవనాలకు, రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కేవలం పేదలకేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. అక్రమ లేఅవుట్లను న్యాయ సలహాలతోనే రిజిస్ట్రేన్ చేయిస్తామన్నారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టౌన్ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అక్రమ కట్టడాల పూర్తి బాధ్యత ఆ ప్రాంత టౌన్ప్లానింగ్ అధికారిదేనని తెలిపారు. గ్రేటర్ పరిధిలో నీటి ఇబ్బందిని తొలగించేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాల మార్గదర్శకాల జారీ అనంతరం మంత్రి విూడియా ద్వారా వివరాలను వెల్లడిస్తూ.. గడువు ముగిశాక అక్రమ నిర్మాణాలు, లేఔట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు నెలలపాటు స్వీకరణ. దరఖాస్తులు అందాక 6 నెలల్లోపు ఆమోదిస్తామని అన్నారు. ఇందుకు 10 వేలు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఇకపై భవన నిర్మాణ, లేఔట్ అనుమతులకు సింగిల్ విండో విధానంలో చేపడతామన్నారు. భవిష్యత్తులో వెలిసే అక్రమ నిర్మాణాలకు మూడంచెల్లో పన్నులు విధిస్తామని అన్నారు. 100 విూటర్ల లోపు ప్రతి చదరపు విూటర్కు రూ. 200,101 నుంచి 300 విూటర్ల వరకు ప్రతి చదరపు విూటర్కు రూ. 400, 301 నుంచి 500 విూటర్ల వరకు ప్రతి చదరపు విూటర్కు రూ. 600, 500 విూటర్లపైన ప్రతి చదరపు విూటర్కు రూ. 750 వసూలు చేస్తామన్నారు. సబ్కమిటీ సూచనల మేరకే భూముల క్రమబద్దీకరణ మార్గదర్శకాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పేదలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందించినంట్లు వెల్లడించారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలు క్రమబద్దీకరించుకోకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గడువు పూర్తయ్యాక తరువాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించబోమని, అలా దరఖాస్తు చేసుకోని కట్టడాలపై చర్య తీసుకుంటామని అన్నారు. గృహావసరాలు, వాణిజ్య సముదాయాలకు వేర్వేరుగా అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు. క్రమబద్దీకరించుకోకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించామన్నారు. అక్రమ లేఅవుట్లు, భవనాలు గుర్తించేందుకు స్పెషల్ ప్లయింగ్ స్కాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. గూగుల్ మ్యాప్ల ద్వారా అక్రమ భవనాలు గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు
మంత్రి పేర్కొన్నారు.