అపూర్వ కలయిక

5

– కీలక బిల్లుల ఆమోదానికి సోనియా, మన్మోహన్‌లతో మోదీ రాయబారం

న్యూఢిల్లీ,నవంబర్‌27(జనంసాక్షి):

కీలక బిల్లుల విషయంలో అధికార బిజెపి వ్యూహం మార్చింది. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని పోవాలని నిర్ణయించింది.  ఎన్డీఏ ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు  గట్టెక్కకుండా మగ్గిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రధానాంశమైన వస్తు సేవల పన్ను (జీఎస్‌ టీ) బిల్లు సహా ఇతర కీలక బిల్లుల ఆమోదానికి ప్రధాన విపక్ష పార్టీతో చర్చలకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లను ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. పెండింగ్‌ బిల్లులపై చర్చించేందుకు సోనియా, మమన్మోహన్‌ను ప్రధాని ఆహ్వానించినట్లు చెప్పారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లు సహా 36 బిల్లులు సభ ముందుకు రానున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోయినా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ లను శుక్రవారం తేనీటి విందుకు ఆహ్వానించారు.  ఇరు పక్షాల మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని  అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విూడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌ లో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ తోపాటు విపక్షాలన్నింటితో మాట్లాడుతూనే ఉన్నామని, ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకముందన్నారు. రాజ్యాంగం అమలుపై జరుగుతున్న ప్రత్యేక చర్చలో భాగంగా నేడు లోక్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారని, మరో మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఇక  పార్లమెంట్‌ ఉభయ సభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గౌరవార్థం రెండో రోజు కూడా ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. భారత రాజ్యాంగం కట్టుబాట్లు అంశంపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించిన చర్చ కొనసాగుతోంది. స్లోవేనియా ప్రతినిధి బృందం పార్లమెంట్‌లోని ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని పార్లమెంట్‌ సమావేశాలను వీక్షించారు. భారత్‌లో పర్యటిస్తున్న స్లోవేనియా సభ్యులకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అభినందనలు తెలిపారు.