ఆర్థిక విధానాలను సవిూక్షించుకోవాలి

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు రావాలి
కూడు,గూడు, గుడ్డ అందేలా చూడాలి
న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతందో తెలుసుకోలేక పోతున్నారు. ప్రజల జీవన స్థితిగతులను పట్టించుకోవడం లేదు.  ప్రధాని మోడీ కేవలం తాను అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించా రంటూ, చెప్పుకోవడం ఆత్మవంచన తప్ప మరోటి కాదు. కేవలం కాంగ్రెస్‌ను, విపక్షాలను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేల సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహరధాన్యాల ధరలు తగ్గాలి. ఎక్కడ తప్పిదం జరిగిందో పరిశీలన చేయాలి. కేవలం కార్పోరేట్‌ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద,సామాన్య ప్రజలు ఎంతగా చితకి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఎందుకు ఆలోచన చేయడం లేదు. దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది ఆలోచన చేయాలి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా ఉన్నారే తప్ప ఫలితాలను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దు కుంటామని ప్రకటించడం లేదు. ప్రజలకు గుజరాత్‌ మోడల్‌ అంటూ ప్రచారం చేసి, ప్రధాని పదవిని చేపట్టిన మోడీపై ప్రజలకు విశ్వాసం ఉంటే పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఎందుకు ఉంటాయి. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే వాత తప్పదని ఈ ఫలితాలు ద్వారా ప్రజలు కొద్దిగా రుచి చూపారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రధాని తన వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టి ప్రచారం చేశారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రం చేజారిపోలేదనే సంతృప్తి మాత్రమే మిగిలింది తప్ప, ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించలేకపోతున్నామని  గమనించాలి. సంస్కరణలంటే ఇవే తప్ప మరోటి కాదని గుర్తుంచుకోవాలి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ధరలను, నేటి మార్కెట్‌ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి.  ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉన్నా, గట్టిగా పోటీ పడలేకపోయినా ప్రజల ఆలోచనలు కాంగ్రెస్‌ వైపు మళ్లేలా చేసింది ప్రధాని మోడీ అని గుర్తించాలి. ఇకముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుందని భావించాలి. దానికి కాంగ్రెస్‌ గొప్పతనం కాకుండా మోడీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి. హిమాచల్‌లో అధికారం కోల్పోయి బిజెపికి మాత్రం ముచ్చెమటలు పట్టించారు. కర్నాటకలోనూ గెలిచారు. తరవాత తెలంగానలో పాగా వేశారు. కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుందనడానికి ఈ
ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనం. మూడు రాష్టాల్ల్రో తమ పార్టీకి విజయం సాధించే ప్రధాన బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తమ భుజాలపై వేసుకున్నా,  ఆలోచన చేయాల్సిన సమయమిది. తాము ప్రవచిస్తున్న సంస్కరణలు ఎక్కడ దారితప్పాయో గమనించాలి. పివి నరసింహారావు లాగా సంస్కరణలు ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోతున్నాయో పరిశీలన చేయాలి. ఇప్పటికైనా నోట్లరద్దు,జిఎస్టీ విపరిణామాలను విశ్లేషించుకోవాలి. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని మిత్రద్వయం గుర్తించి ప్రజలకు మేలుచేసే సంస్కరణలను అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు.