ఆర్మాన్‌ కోహ్లీని క్షమించేశాను

అందుకే కేసు వాపసు తీసుకున్నా!

ఆర్మాన్‌ కోహ్లీ ప్రేయసి నీరూ

ముంబయి, జూన్‌14(జ‌నం సాక్షి) : బాలీవుడ్‌ నటుడు, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అర్మాన్‌ కోహ్లీని ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను దారుణంగా కొట్టి హింసించాడని అర్మాన్‌ ప్రేయసి నీరూ రాంధవా ముంబయిలోని శాంటాక్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. దాంతో వారం రోజుల పాటు పరారీలో ఉన్న అర్మాన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్మాన్‌పై పెట్టిన కేసును నీరూ వాపసు తీసుకున్నారు. కానీ, అర్మాన్‌కు ముంబయి న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వలేదు. అతన్ని జూన్‌ 26వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. అయితే కేసును ఎందుకు వాపసు తీసుకోవాల్సి వచ్చిందో నీరూ విూడియా ద్వారా వెల్లడించారు. ‘అతని పని ప్రజలను హింసించడమే. అందుకే అతని జోలికి వెళ్లదలచుకోలేదు. నాకు బ్రిటన్‌ పాస్‌పోర్ట్‌ ఉంది. కాబట్టి, నేను మున్ముందు భారత్‌ వదిలి యూకేలో స్థిరపడే అవకాశం ఉంది. ఒకవేళ అర్మాన్‌పై పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే మాటిమాటికీ ముంబయి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్మాన్‌ లాంటి విలువలేని వ్యక్తి కోసం నాకు ఈ గొడవంతా అవసరమా? దాని కంటే అతన్ని ఓ పీడకలలా భావించి మర్చిపోవడం మంచిది కదా అని పేర్కొంది. అతను నా పట్ల ప్రవర్తించిన తీరును మర్చిపోలేను. కానీ, ప్రయత్నిస్తాను. నాకు సానుకూల దృక్పథం ఎక్కువ.’ అని తెలిపారు నీరూ. గతంలో అర్మాన్‌..బాలీవుడ్‌ నటి కాజోల్‌ సోదరి తనీశా ముఖర్జీతో ప్రేమలో ఉన్నాడు. కానీ, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.