ఆర్‌బిఐలో మీ జోక్యం ఎందుకు?

4

– విమర్శలపై వాల్‌స్ట్రిట్‌ జర్నల్‌ ఇంటర్వ్యూలో ప్రధాని

న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌  ఆఫ్‌ ఇండియా గవర్నర్‌  రఘురామ రాజన్‌  పునర్నియామకంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి మౌనం వీడారు. ఇది ప్రభుత్వ వ్యవహారమని, పబ్లిగ్గా చర్చించాల్సిన అసవరం లేదన్నారు.  ఆర్‌ బీఐ గవర్నర్‌ గా రాజన్‌  రెండవసారి ఎంపికను  సమర్థిస్తారా అని అడిగినపుడు.. ఈ విషయం  పరిపాలనకు సంబంధించిన విషయమన్నారు.  దీంట్లో  విూడియాకు సంబంధంలేదని వ్యాఖ్యానించారు. రాజన్‌పై  బీజేపీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వరుస సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందించడం  ఇదే మొదటిసారి. రాజన్‌ నియామకం  పాలనా వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారమని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో విూడియాకు అంత  ఆసక్తి అవసరం లేదనుకుంటున్నానంటూ ప్రధాని  వ్యాఖ్యానించారు. మరోవైపు సెప్టెంబర్‌ లోనే ఈ విషయాన్ని పరిశీలిద్దామని ది వాల్‌ స్టీట్ర్‌ జర్నల్‌తో చెప్పారు. ఆయన పదవీకాలం  సెప్టెంబర్లో ముగుస్తుంది కనుక  అప్పుడు  చూద్దామన్నట్టు  చెప్పారు. అయితే  ఆర్బీఐ గవర్నర్‌ గా రఘురామ రాజన్‌ను  తక్షణమే తొలగించాలంటూ సుబ్రహ్మణ్య  స్వామి డిమాండ్‌ చేయడంతో వివాదం మొదలైంది. రాజన్‌ ఉద్దేశపూర్వకంగానే  దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నారని, దేశంలో నిరుద్యోగం పెరిగిందంటూ తీవ్రమైన ఆరోపణల పరంపరను కొనసాగించారు. ఈ  విషయంలో  పట్టువీడని స్వామి ..మోదీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు కూడా రాశారు. కాగా  రఘురామ్‌ రాజన్‌ ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి అర్హుడని కాంగ్రెస్‌  సీనియర్‌ నాయకులు  దిగ్విజయ్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు నెటిజన్లు రాజన్‌ సమర్థతతపై అనేక సర్వేల్లో సానుకూలంగా స్పదించారు. రాజన్‌ మూడేళ్ల  పదవీకాలం ఈ సెప్టెంబర్‌ ముగియనుంది. రాజన్‌పై బహిరంగ విమర్శనలు ఆర్థికమంత్రి జైట్లీ కూడా తోసిపుచ్చారు.