ఆలయాలకు శ్రావణశోభ

గోదావరి తీరాల్లో భక్తుల సందడి
కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): శ్రావణ మాసం సోమవారం సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చేయించారు. వేములవాడ మొదలుకుని ధర్మపురి, కాళేశ్వరం, బాసర తదితర క్షేత్రాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. కాళేశ్వరంలో గోదావరి స్నానాలు చేసిన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. ధర్మపురిలో కూడా గోదావరి స్నానాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరి కళకళలాడుతండడంతో ప్రజలు భారీగా తరలి వచ్చారు. బాసరలో కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేములవాడలో భారీగా భక్తులు తరలివచ్చారు. గుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు తీర్చుకున్నారు. ఇకపోతే కోటిలింగాల గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేశారు. ఆలయంలోని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల దుర్గామాత ఆలయం భక్తులతో సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శుక్రవారం అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రత చర్యలు చేపట్టారు. చిట్కుల్‌ గ్రామ శివారులోని చాముండేశ్వరీ ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం సవిూపంలో ఉన్న మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.