ఆ రోజు రాత్రి 13సార్లు ఫోన్ చేశాడు

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకుడు అన్మోల్ రతన్ (29) అత్యాచారం చేసిన తర్వాత తనను బెదిరించాడని బాధితురాలైన పీహెచ్డీ విద్యార్థిని (28) చెప్పింది. బుధవారం ఆమె మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది.  ఈ ఘటన జరిగిన రోజు రాత్రి రతన్ 13 సార్లు తనకు ఫోన్ చేసి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించినట్టు బాధితురాలు చెప్పింది.

‘నాకు ఓ సినిమా సీడీ కావాలని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, తన దగ్గర ఉందని రతన్ కాంటాక్ట్ అయ్యాడు. శనివారం సాయంత్రం జేఎన్యూ క్యాంపస్లోని బ్రహ్మపుత్ర హాస్టల్లో రతన్ రూమ్ వద్దకు వెళ్లా. అతను డ్రింక్ ఆఫర్ చేస్తే తాగాను. డ్రింక్లో మత్తుమందు కలపడంతో నేను అపస్మారకస్థితిలో ఉండిపోయా. ఆ సమయంలో రతన్ నాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అపస్మారకస్థితిలో ఉండటంతో అతన్ని అడ్డుకోలేకపోయాను. నాకు కావాల్సన సినిమా సీడీ తన వద్ద లేదని, కావాలనే అబద్ధం చెప్పినట్టు ఆ తర్వాత రతన్ చెప్పాడు. బైకుపై నన్ను హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. నేను వారించి ఫ్రెండ్ సాయంతో వెళ్లా. ఆ రోజు రాత్రి రతన్ వరుసగా ఫోన్లు చేస్తూ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు’ అని పీహెచ్డీ విద్యార్థిని వాంగ్మూలం ఇచ్చింది. మరుసటి రోజు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. రతన్ పరారీలో ఉన్నాడని, ఫోన్ సిచ్ఛాఫ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.