ఇంతోనే ఎంతో మార్పు

` భారత్‌కు చైనా స్నేహ హస్తం
` 85వేల వీసాలు ఇచ్చిన డ్రాగన్‌
` భారత స్నేహితులకు స్వాగతమంటూ పోస్ట్‌
బీజింగ్‌(జనంసాక్షి): సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తుంటుంది. అయితే ఇటీవల ఆ వైఖరిలో మార్పు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌వైపు చైనా స్నేహహస్తాన్ని చాస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ పర్యటకులను ఆకట్టుకునేలా.. మరీ ముఖ్యంగా తమ దేశంలో భారతపౌరుల ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగా ఏప్రిల్‌ 9 వరకు 85వేల వీసాలు జారీ చేసింది. ఈ మేరకు మనదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్‌ వెల్లడిరచారు.‘’భారత్‌లోని చైనా ఎంబసీ, కాన్సులేట్లు ఈ ఏడాది ఏప్రిల్‌ 9 వరకు భారతీయులకు 85వేలకుపైగా వీసాలు జారీ చేశాయి. చైనాను సందర్శించడానికి మరింతమంది భారత స్నేహితులకు స్వాగతం. సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తివంతమైన చైనాను ఆన్వేషించండి’’ అని ఫీహాంగ్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. మార్చిలో కూడా ఆయన ఈ తరహా పోస్టు చేశారు. అప్పటికే 50వేల వీసాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వీసా ధరలపై తగ్గింపును డ్రాగన్‌ మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబరు 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతుందని వెల్లడిరచింది. చైనాను సందర్శించే విదేశీయుల ప్రయాణ విధానాలను క్రమబద్ధీకరించడం కోసం ఈ చర్యలు చేపట్టామని దౌత్య కార్యాలయం అప్పట్లో వెల్లడిరచింది. గతేడాది ఈ వీసా ధరలను తగ్గించారు. అప్పటినుంచి సింగిల్‌ ఎంట్రీ వీసాలకు రూ.2,900, డబుల్‌ ఎంట్రీ వీసాలకు రూ.4,400 వసూలుచేస్తున్నారు. ఆరు నెలల గడువు ఉండే మల్టిపుల్‌ ఎంట్రీ వీసాకు రూ.5900, సంవత్సరం, అంతకంటే పైబడి గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసా రూ.8,800 చెల్లించాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌ నుంచి చైనా నుంచి సానుకూల వైఖరి కనిపిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించుకోవడం కోసం భారత్‌, చైనా ఆ నెలలోనే కీలక గస్తీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల భారత ఆర్థిక వృద్ధి అమోఘం అంటూ చైనా కాన్సుల్‌ జనరల్‌ జువీ కొనియాడిన సంగతి తెలిసిందే. హిందీ చినీ భాయ్‌ భాయ్‌’ అంటూ భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఇక అమెరికా ప్రతీకార సుంకాల వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌కు స్నేహహస్తం చాచారు. భారత్‌తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసే సమాజాన్ని నిర్మించాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.