*ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం*

మునగాల, ఆగష్టు 30(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మంగళవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇప్పటికే ఎందరో దాతలు దాతృత్వంతో ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ముకుందాపురం గ్రామానికి చెందిన షేక్ సోందూబి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ కనీసం ఒక్కరోజైనా ఆశ్రమంలో ఉన్న అనాధలకు, మానసిక వికలాంగులకు వృద్ధులకు కడుపు నింపాలని        ముందుకు రావడం అభినందనీయమని, ఇలా మిగిలిన వారు కూడా  సోందుబీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చి నిరాదరణకు గురై నిస్సాహాయస్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోందుబి కుమారుడు సైదా హస్సేన్, కుమార్తె షరీఫాబేగం, ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, షేక్ జాహేద, షేక్ పాషా, నీలమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.