ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ,

పవన్ కల్యాణ్ భార్యపై ట్రోలింగ్… ఘాటుగా స్పందించిన విజయశాంతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో, పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. చిన్నారి మార్క్ శంకర్ పేరిట తిరుమల నిత్యాన్నదానానికి రూ. 17 లక్షల విరాళాన్ని అందించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు, లెజినోవాను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆమె తలనీలాలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. సనాతనంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదని అంటున్నారు. ఈ ట్రోల్స్ పై సీనియర్ సినీ నటి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
“అన్నా లెజినోవా గారు దేశం కాని దేశం నుంచి వచ్చారు. పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ… ఆమె హిందూ ధర్మాన్ని విశ్వసించారు.  దురదృష్టకర అగ్నిప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడి కరుణాకటాక్షాలే కారణమనే విశ్వాసంతో శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్ కు విరాళం కూడా ఇచ్చారు. హిందూ సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాను ట్రోల్ చేయడం సరికాదు” అని విజయశాంతి అన్నారు.