ఇక స్వచ్ఛ హైదరాబాద్‌

C
– పేదలకు 2 లక్షల ఇళ్లు

– నిరంతర విద్యుత్‌పై దృష్టి

– సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌29(జనంసాక్షి):: ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వచ్ఛ హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. ఇందుకు నిధులు విడుదల చేసి పారిశుద్ద్య  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మే 16న గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మే16 నుంచి 20 వరకు కొనసాగనుంది. రూ.వెయ్యి కోట్లతో హైదరాబాద్‌ను పరిశుభ్రంగా మార్చాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం హైదరాబాద్‌ను 400 భాగాలుగా విభజించి అందరి భాగస్వామ్యంతో ముందకెళ్లడంతోపాటు స్వచ్ఛ హైదరాబాద్‌లో సినీ నటులు, క్రీడాకారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు హైదరాబాద్‌లో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు సిఎం కెసిఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సిద్దం చేశారు. హైదరాబాద్‌ నగరంలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు 2వేల ఎకరాల భూమిని సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇవాళ సీఎం హైదరాబాద్‌ లో పేదల గృహనిర్మాణాలపై సవిూక్షను నిర్వహించారు. ఇందులో భాగంగా భూ సేకరణ జరిపిన తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకుని రెండు లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. నిరుపేదల ఇండ్లంటే ఎక్కడో విసిరేసినట్టు దూరంగా ఉండొద్దని.. వారి ఇండ్లు నగరం మధ్యలోనే ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.హైదరాబాద్‌ లో పేదల గృహనిర్మాణాలపై సవిూక్షను నిర్వహించారు. ఈ సవిూక్షలో సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో దాదాపు రెండు లక్షల మంది నిరుపేదలకు ఇండ్లు లేవని..ఇండ్లు లేని నిరుపేదలకు 2వేల ఎకరాల్లో పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో బహుళ అంతస్థుల భవనాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కటించి ఇస్తమని సీఎం పునరుద్ఘాటించారు. వీలైతే బంజారాహిల్స్‌లోనే పేదలకు ఇండ్లు కట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ధనవంతుల విలాసాలు, వినోదాలు, కాలక్షేపాలు, అలవాట్లకోసం వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని… నిలువ నీడలేని నిరుపేదలకు ఇండ్లు కట్టించడానికి విలువైన స్థలాలను వినియోగిస్తే తప్పేంటని అన్నారు. ఈ దిశగా ఆలోచించి పేదల ఇంటి నిర్మాణం కోసం స్థలాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు పదుల ఎకరాలు చిన్న పాటి విద్యాసంస్థలకు వందల ఎకరాలు, యూనివర్సిటీలకు వేల ఎకరాలు, వివిధ క్లబ్బులకు పెద్ద మొత్తంలో భూముల కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.  కేటాయింపులు జరిగిన భూములు చాలా వరకు నిరుపయోగంగానే ఉన్నయని.. ఆ భూములను పేదల ఇంటి నిర్మాణాల కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్పోరేట్‌ సంస్థలు, పరిశ్రమలకు భూములు కేటాయించినపుడు నిరుపేదలకు కూడా ప్రభుత్వ భూములు కేటాయించాలని సూచించారు. రూ.లక్ష 15వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల ఇండ్ల నిర్మాణాలకు నిధుల కొరత సమస్య ఉండొద్దని అధికారులను ఆదేశించారు. భూమిలేని,బువ్వలేని,ఇండ్లు లేని నిరుపేదలున్నారని.. వారి గురించి ఆలోచించే సామాజిక బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మొదటి దశలో హైదరాబాద్‌ నగరంలో నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తమని అన్నారు. ఇల్లు లేకపోవడం పెద్ద శాపమని.. ఆ బాధ ఇల్లు లేని వారికే తెలుస్తుందన్నారు. ఆ కష్టాల నుంచి పేదలను గట్టెక్కించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికి మంచినీరు అందిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నట్టే.. ప్రతీ నిరుపేదకు సొంతిల్లు కట్టించాలనే ఆశయంతో ప్రభుత్వం ఉందని తెలిపారు.

హైదరాబాద్‌లో పేదలకు 2 లక్షల ఇళ్లు

హైదరాబాద్‌లో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించేందుకు సిఎం కెసిఆర్‌ సంసిద్దత ప్రకటించారు. నిరుపేదలైన 2 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణంపై సిఎం ఉన్నతస్థాయి సవిూక్ష చేశారు.  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వీలైతే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు, క్లబ్‌లకు పదుల ఎకరాల స్థలం ఉందని వివరించారు. వాటిలో చాలా భాగం నిరుపయోగంగా ఉందని, ఈ స్థలాలను పేదల గృహనిర్మాణాలకు ఉపయోగిస్తామని కేసీఆర్‌ చెప్పారు. నిలువ నీడలేని పేదలకు ఇల్లు కట్టించేందుకు విలువైన స్థలాలు ఉపయోగిస్తే తప్పులేదని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా హైదరాబాద్లో ఇళ్లు లేని పేదలు 2 లక్షలమంది ఉన్నారని తేలిందని కేసీఆర్‌ అన్నారు. పేదలందరికీ ప్రభుత్వం తరపున ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.

వచ్చే ఏడాదికల్లా తెలంగాణలో నిరంతర విద్యుత్‌

వచ్చే ఏడాది నాటికి విద్యుత్‌ కొరత లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అదనంగా 3 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేసీఆర్‌  విద్యుత్‌ సరఫరా తీరుపై ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది రెండో పంటకు పగటిపూట 9 గంటలు విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లగొండలో నిర్మించనున్న థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. దీనికి యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌గా పేరును ఖరారు చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు.   వచ్చే ఏడాది రెండో పంటకు పగటి పూటే  9 గంటల విద్యుత్‌ ఇచ్చేలా  అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి  7 వేల మెగావాట్ల విద్యుత్‌  అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. 2018లో విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని  సీఎం అన్నారు. 2018 సంవత్సరం నాటికి తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ సవిూక్షలో వచ్చే ఏడాది నుంచి యాసంగి పంటలకు పగటిపూట 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 4,320 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉందని.. వచ్చే మార్చి నాటికి 3వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎన్టీపీసీ జజ్జర్‌ నుంచి 150 మెగావాట్ల విద్యుత్‌, సీజీఎస్‌ ద్వారా 290 మెగావాట్ల, గాయత్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌నుంచి 810 మెగావట్లు, భూపాలపల్లి కేటీపీఎస్‌ నుంచి 600 మెగావాట్లు, సింగరేణి జైపూర్‌ నుంచి 1,200 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు ప్రజల అవసరాలకనుగుణంగా విద్యుత్‌ శాఖ పనిచేస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని 2016 నాటికి తెలంగాణ విద్యుత్‌ కొరత లేని రాష్ట్రంగా మరాతుందని స్పష్టం చేశారు.