ఇస్రో ‘మిషన్ ఆదిత్య’

aditya-l1-isroభారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా మిషన్ ఆదిత్య అంటోంది ఇస్రో. 2020లో తమ మిషన్ కార్యరూపం దాలుస్తుందని చెబుతున్నారు అధికారులు. సూర్యుడిపై విస్తృత పరిశోధనల కోసం ‘ఆదిత్య-ఎల్‌1’ ఉపగ్రహాన్ని 2020లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్  మైలాస్వామి అన్నాదురై. ఆదిత్య-ఎల్‌1లో ఆరు పరిశోధన పరికరాలు ఉంటాయి. సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరు తెన్నుల గురించి ఇది పరిశోధిస్తుంది. సౌర తుపాను సమయంలో వెలువడే ఈ రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్పియర్‌), వర్ణ మండలాలను (క్రోమోస్పియర్‌) అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారని చెప్పారు.