ఈజిప్టుతో కీలక ఒప్పందాలు
మొర్సీకి స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి) :
పరస్పరం ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్, ఈజిప్టు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు మంగళవారం ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి కావడం గమనార్హం. ప్రధాని మన్మోహన్సింగ్, ఈజిఫ్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తమ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని, ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని చర్చల అనంతరం వారు ప్రకటించారు. ఉన్నతస్థాయి సమావేశంలో ఇరు దేశాల మధ్య ఈ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ, ఖర్షీద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీకి న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు స్వాగతం పలికారు. మోర్సీ వెంట ఉన్నతస్థాయి బృందం భారత్కు వచ్చింది.