ఉక్కు పరిశ్రమల ఏర్పాటు తక్షణావసరం

నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లరాదు

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం. అలాగే ఈ విషయంలో కొంత నష్టం లేదా కష్టం కలిగిన యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలి. అంతేగానీ వీటి ఏర్పాటు సాధ్యం కాదనుకుంటే దేశంలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం లో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తీరు నిరుద్యోగులను వంచించేలా ఉంది. అలాగే స్థానకంగా లభ్యమవుతున్న ముడిసరుకుని విదేవాలకు తరలిస్తున్న తీరును అడ్డుకునేలా లేదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదంటూ సెయిల్‌ 2014 డిసెంబర్‌లో ఇచ్చిన నివేదికను 2018 జూన్‌ 13నసుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేయడంలోనే కేందప్రభుత్వ దగా స్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎంఎంటిసి, మెకాన్‌ సంస్థల ప్రతినిధులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను 2016 అక్టోబర్‌లో నియమించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలున్నాయనీ, అనంతపురం గనుల ఖనిజం నాణ్యత ఎక్కువనీ మెకాన్‌ సంస్థ నిర్ధారించింది. కడప ఉక్కు కర్మాగారానికి ఆ ఖనిజ నిక్షేపాలను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతనూ తెలిపింది. వీటన్నిటి ఆధారంగా కడప ఉక్కు కర్మాగార ఏర్పాటు సాధ్యమేనని మెకాన్‌ సంస్థ ఈ ఏడాది సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయినా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో 2017 డిసెంబర్‌నాటి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం గురించి మాత్రమే పేర్కొనడం వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అన్నది గమనించాలి. ఇలాంటి విషయాల్లో నాలుగేళ్లుగా కాలయాపన చేసి చివరి సంవత్సరం చేతులెత్తేయడం ద్వారా బృహత్తర లక్ష్యాన్ని దెబ్బతీయడం కాకా మరోటి కాదు. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉన్న అవకాశాలను దెబ్బతీయడం తప్ప మరోటి కాదు. సామాన్య ప్రజలనేగాక న్యాయ వ్యవస్థనూ మోడీ సర్కారు పక్కదారి పట్టించందనే అనుకోవాలి. కడప ఉక్కు విషయంలో మోసాన్ని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో నిరసించగానే కేందప్రభుత్వం గురువారం ప్రకటన విడుదల చేయడం మరో కొత్త నాటకానికి తెర లేపడమే. ఆ ప్రకటనలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తాజా సమావేశం జూన్‌12న జరిగిందని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకు జూన్‌13న సమర్పించిన అఫిడవిట్‌లో ఎందుకు వెల్లడించలేదు? ఏర్పాటుకు అనుకూలంగా మెకాన్‌ సంస్థ సమర్పించిన ప్రాథమిక నివేదికను గురించి తాజా ప్రకటనలో కూడా ప్రస్తావించలేదంటేనే కడప ఉక్కుపట్ల కేంద్రం ఎంత ప్రతికూలంగా వుందో స్పష్టమవుతోంది. ప్రజల్లో గందరగోళం పెంచడానికే ఈ తాజా వివరణ ఇచ్చారన్నది సుస్పష్టం. రైల్వే జోన్‌ ఏర్పాటుపైనా ఎన్‌డిఎ ప్రభుత్వం దోబూచులాడుతూనేవుంది. గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చేపట్టవలసిన చట్ట సవరణను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మూడేళ్లు మాత్రమే ఇచ్చి, తర్వాత నిలిపివేసింది. పోర్టు ఏర్పాటుకూ తిలోదకాలిచ్చింది. ఇలా అనేక అంశాల్లో తెలుగు ప్రజలపట్ల మోడీ సర్కారు ద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది. సంకుచిత స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు విరుద్దంగా అభివృద్ది సాగాలి. అప్పుడే ఉక్కు పరిశ్రమల ఏర్పాఉట సాకారం కాగలదు.