ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌లో ఫత్వా జారీ

3

హైదరాబాద్‌  నవంబర్‌18(జనంసాక్షి):

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫత్వా మన దేశంలో జారీ అయ్యింది. భారత్‌లోని వివిధ మసీదులకు చెందిన వెయ్యిమందికిపైగా ఇమామ్‌లు, ముఫ్తీలు ఈ ఫత్వాపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న అలయన్స్‌ ఆఫ్‌ సివిలైజేషన్‌ చేపట్టిన ఈ కార్యక్రమం ఇస్లాంకు ఏమాత్రం వ్యతిరేకంగా కాదని దీనిపై సంతకాలు చేసిన ముస్లింమత పెద్దలు చెబుతున్నారు. మానవాళి నాశనాన్ని కోరుకుంటున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే ఈ ఫత్వా జారీ చేసినట్టు ఇస్లామిక్‌ సైబర్‌ డిఫెన్స్‌ సెల్‌ అధినేత అబ్దుల్‌ రెహ్మాన్‌ అంజారియా చెప్పారు. రెండు నెలల క్రితం ఈ ఆలోచన చేసిన ఆయన … షరియా చట్టాలంటూ ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలను మత పెద్దలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. ఖురాన్‌లో ఎక్కడా హింస గురించిన ప్రస్తావన లేదున్నారు. ఒక అమాయకున్ని చంపినా.. అది మానవాళి మొత్తాన్ని చంపినట్టేనని ఖురాన్‌లో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.