ఉగ్రవాదిని కరిగించిన తల్లి ప్రేమ!
శ్రీనగర్, జమ్ము: కడుపుకోత మిగల్చకురా.. అంటూ కన్న కొడుక్కు ఆ తల్లి పెట్టుకున్న మొర ఫలించింది! విద్రోహ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన ‘ఉగ్రవాది’ని ఆ మాతృమూర్తి కంటతడి మళ్లీ మామూలు మనిషిని చేసింది!! కశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. సోపోర్లోని ఓ ఇంట్లో లష్కరే తయిబా(ఎల్ఈటీ) ముష్కరుడు ఉమర్ ఖలిక్ మిర్(26) దాగి ఉన్నాడంటూ నిఘా సమాచారం అందుకున్న సైన్యం.. వెంటనే వెళ్లి ఆ ఇంటిని చుట్టుముట్టింది.
ఇంటి నుంచి బయటకు వచ్చి లొంగిపోవాలంటూ అధికారులు మిర్కు సూచించారు. అయితే, వారి సూచనలను మిర్ ఖాతరు చేయలేదు. దీంతో అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని తుజ్జర్లో నివాసముంటున్న మిర్ తల్లిదండ్రులకు అధికారులు పరిస్థితిని వివరించారు. కుమారుడు లొంగిపోయేలా అనునయించాలని సూచించారు. అతడికి పెద్ద శిక్ష పడకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు ఆ తల్లిదండ్రులు వెంటనే అంగీకరించారు. అనంతరం మిర్ దాగి ఉన్న ఇంట్లోకి అతడి మాతృమూర్తి వెళ్లి భావోద్వేగంతో కుమారుడికి చాలాసేపు మొరపెట్టుకుంది. ఎట్టకేలకు తల్లి వేదన ఆలకించిన మిర్.. బయటకు వచ్చి సైన్యానికి లొంగిపోయాడు. తన వద్ద ఉన్న రైఫిల్, తూటాలు, గ్రెనేడ్లు, రేడియో సెట్ను అధికారులకు అప్పగించాడు. ఈ ఏడాది మేలో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మిర్.. ఎల్ఈటీలో చేరిన సంగతి గమనార్హం.