ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 1( జనంసాక్షి)
జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులకు, క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ఊట చెరువులు, ఫాంపౌండ్ , ఫిష్ పాండ్లను నిర్మించాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో వచ్చే విధంగా చూడాలన్నారు. కేంద్ర బృందాలు గ్రామాల్లో పర్యటించే వీలున్నందున పనులు చేపట్టిన స్థలంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏడు రికార్డులను సజావుగా నిర్వహించాలని సూచించారు. పనులు చేయించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం కామారెడ్డి ఎస్పి కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాము లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్డిఓ సాయన్న, ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.