ఉరిశిక్ష అమలుతో న్యాయం జరిగింది

ముంబయి దాడిలో బాధిత కుటుంబాల వెల్లడి

ముంబయి: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష అమలుతో తమకు న్యాయం జరిగిందని ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన రైల్వే టికెట్‌ భార్య రాగిణి శర్మ అన్నారు. ఆమె భర్త ఎస్కే శర్మ ఛత్రపతి శివాజీ రైల్వేస్టేషన్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. కసబ్‌కు క్షమాభిక్ష తిరస్కరించినందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కసబ్‌ ఉరితీత ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి  అని రైల్వే స్టేషన్‌లో అనౌన్సర్‌ విష్ణు జెందే అన్నారు. ఉగ్రవాదుల కాల్పులకు పాల్పడుతున్నప్పుడు రైల్వేస్టేషన్‌ మైకుల ద్వారా విషయాన్ని చేరవేసి చాలామంది ప్రాణాలను జెందే కాపాడారు.