ఎండిన పంటకు ఎకరానికి 4వేల పరిహారం

4
– మంత్రి పోచారం

బీర్కూర్‌ అక్టోబర్‌23(జనంసాక్షి):

తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.4వేలు పరిహారం అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం దుర్కి గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి అన్నదాతలు తప్పనిసరి పరిస్థితుల్లో పంటలు సాగుచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఒకవైపు 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నా పంటలు ఎండిపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఆవేదన గుర్తించి పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేలు పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని మండలాల తహసీల్దార్లకు పంట నష్టపోయిన అర్హులైన రైతులను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ధాన్యం ఏగ్రేడ్‌ ధర రూ.1450, బీ గ్రేడ్‌ ధర రూ.1410గా కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ా’య్రర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీపీ మీనా, వైస్‌ ఎంపీపీ ఉమా నార్ణాొడ్‌, సర్పంచి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.