ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. కాని కేసీఆర్‌ తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ.47 వేల కోట్ల నిధులను భాజపా ప్రభుత్వం అందించిందన్నారు. భాజపా పార్లమెంట్‌లో మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.నాయకులు హైదరాబాద్‌లో ఒక మాట ఆదిలాబాద్‌లో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. పేదప్రజల కష్టాలను తీర్చాలనే సదుద్దేశంతో పాయల్‌ఫౌండేషన్‌ ద్వారా నీటిని అందిస్తుంటే తెరాస నాయకులు పురపాలక అధికారులకు చెప్పి ఆటంకాలు సష్టించారన్నారు. అలాగే రిమ్స్‌లో పేదల కోసం అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి ఉచిత సేవలందిన్నామని అన్నారు. రాబోయే రోజుల్లో తెరాస పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పిన తెరాస అధికారంలోకి వచ్చి మోసపూరిత పాలన చేస్తోందని అన్నారు.

తాజావార్తలు