ఎల్లుండి నుంచే రాహుల్‌ కైలాస యాత్ర

న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : వరుస పర్యటనలతో బిజీగా ఉన్న రాహుల్‌.. దైవ దర్శనాలు మాత్రం మరవడంలేదు. విదేశీ పర్యటన ముగించుకొని కేరళ బాధితుల్ని పరామర్శించిన వెంటనే.. ప్రఖ్యాత కైలాస మానసరోవర యాత్రకు రాహుల్‌ షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. ఆగస్టు 31 రోజునే రాహుల్‌ మానసరోవర యాత్ర మొదలవుతుంది. వాస్తవానికి కర్నాటక ఎలక్షన్లు పూర్తయిన వెంటనే కైలాస యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీకి సంబంధించి ఆయన ముందున్న టైట్‌ షెడ్యూల్‌ కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కర్నాటక ఎన్నికల ప్రచార సమయంలో తాను ప్లయిట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. అకస్మాత్తుగా ఫ్లయిట్‌ 8 వేల అడుగుల దిగువకు జారిపోయిందని, ఇక పని అయిపోయింది అనుకున్నానని.. అయితే అదే సమయంలో తన మనసులో కైలాసం గుర్తుకొచ్చిందని, కర్నాటక ఎన్నికలు అయిపోయాక కైలాసానికి వస్తానని మనసులోనే మొక్కుకున్నానని రాహుల్‌ స్వయంగా ఢిల్లీ సభలో చెప్పుకోవడం విశేషం. ఆ సమయం ఇప్పుడు వచ్చిందన్నమాట. రాహుల్‌ ఈ మధ్య ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు చుట్టి వస్తున్నారు. మరి కొద్ది నెలల్లో రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ లోపే కైలాస యాత్ర పూర్తి చేసుకొని.. మరింత ఉత్సాహంగా ఎన్నికల బాధ్యతలు నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.