కన్నడ నాట పదవుల కేటాయింపు పూర్తి!

పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అసంతృప్తి
కాంగ్రెస్‌ చేతిలో ఆరు మంత్రి పదవులు
శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న ఖర్గే
బెంగళూరు, జూన్‌9(జనం సాక్షి ) : కర్ణాటకలో పదవుల కేటాయింపునకు దాదాపుగా తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు దాటినా పూర్తి స్థాయి ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ ఏర్పడలేదు. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో కాంగ్రెస్‌ అభిప్రాయానికి అనుగుణంగానే మంత్రిత్వ శాఖల పంపకం జరగాలని నిర్ణయించిన జేడీఎస్‌… అందుకు అనుగుణంగా ఇన్ని రోజులు ఎదురుచూసింది. అయితే రాష్ట్రంలో పాలనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా శాఖల ప్రభుత్వాధికారులతో కుమారస్వామి తరచూ సమావేశం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మొదట రెండు పార్టీల్లోనూ పదవుల పంపకంలో స్వల్ప విభేదాలు తలెత్తాయన్న వార్తలొచ్చినప్పటికీ ఇవి కేవలం వదంతులు మాత్రమేనని ఇరు పార్టీలు ఖండిస్తూ వచ్చాయి. ఇప్పుడీ వార్తలన్నింటికీ సమాధానం చెబుతూ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు, అవి ఎవరెవరికి దక్కాయనే దానిపై స్పష్టత వచ్చేసింది. ఎవర్నీ నొప్పించకుండా ఇరుపార్టీలకు సమన్యాయం జరిగిందని ఇరు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒప్పందంలో భాగానే జేడీఎస్‌కు 11మంత్రిత్వశాఖలు దక్కాయి. కాంగ్రెస్‌లో కొందరు నేతలకు కేటాయించగా, ఇంకా ఆరు మంత్రిత్వశాఖలు మిగిలే ఉన్నాయి.
పదవుల కేటాయింపు ఇలా..
కుమార స్వామికి ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థిక శాఖ, విద్యుత్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమాచారం, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఇంటెలిజెన్స్‌ విభాగం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపముఖ్యమంత్రి పదవితోపాటు బెంగళూరు ఇన్‌ఛార్జిగా కాంగ్రెస్‌ నేత జి.పరమేశ్వర వ్యవహరించనున్నారు.
కుమార స్వామి సోదరుడు రేవణ్ణకు పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రిత్వ శాఖ అప్పగించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆర్వీ దేశ్‌ పాండేకు పరిశ్రమల శాఖ అప్పగించగా.. మరో కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు వైద్య విద్య, నీటిపారుదల శాఖ అప్పగించారు. కాంగ్రెస్‌ నేత కేజే జార్జ్‌కు ఐటీ, బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. ఈసారి కర్ణాటక కేబినెట్‌లోకి కేవలం ఒకే ఒక మహిళ మాత్రమే అడుగు పెట్టారు. నటి జయమాలకు రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతికశాఖ బాధ్యతలను అప్పగించారు.
పదవుల కేటాయింపులో ఇప్పటికే కాంగ్రెస్‌ నేతల్లో తీవ్ర అంసంతృప్తి నెలకొంది. ఇంతకుముందు కాంగ్రెస్‌ హయాంలో ¬ంమంత్రిగా పనిచేసిన రామలింగా రెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు లభించలేదు. హెచ్‌కే పాటిల్‌, రోషన్‌ బేగ్‌లది ఇదే పరిస్థితి. అయితే కాంగ్రెస్‌ చేతిలో ఇంకా ఆరు పదవులున్నాయి. వీటిలో ఆ ముగ్గురికి అవకాశాలున్నాయో లేదో చూడాలి.
శాఖల కేటాయింపులో అన్యాయం జరిగింది ా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్‌లో శాఖల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తులు ఉన్న మాట నిజమేనని ఆ పార్టీ సీనియర్‌ నేత, లోక్‌సభలో కాంగ్రెస్‌ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘మాకు (కాంగ్రెస్‌కు) అన్యాయం జరిగింది. దానిని సరిచేయాల్సి ఉంది’ అని ఆయన అన్నారు. శనివారం విూడియాతో ఆయన మాట్లాడుతూ, ¬ం మంత్రిత్వ శాఖ దక్కలేదని ఫిర్యాదు చేసిన వారు సైతం పార్టీకి విధేయులుగా ఉంటామని, పార్టీని వీడి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక్కోసారి మనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు. కొందరు సభ్యులు అసంతృప్తితో ఉన్నందున అధిష్ఠానం, వారి ప్రతినిధులు తప్పనిసరిగా వారితో మాట్లాడాల్సి ఉంటుందన్నారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కారణం మాత్రం ఉంటుందని ఖర్గే వివరించారు.