కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): పల్లెలు, పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదోళ్లంతా పెద్దోళ్లు కావడమే సీఎం అభిమతమని చెప్పారు. మాట్లాడుతూ గ్రావిూణ ప్రాంతా లు అభివృద్ధి చెందాలనే నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పల్లె, తండా అభివృద్ధి కోసం అహర్నిషలూ శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. నూతన పంచాయతీలను రెండేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చేసినదానికంటే ఎక్కువ అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే చేసి చూపించామని తెలిపారు. దసరా నాటికి ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామన్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు తోడు మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ వచ్చిందనీ, రైతుల పేరు చెప్పుకొని కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చారిత్రక నిర్ణయంతో మిషన్‌ కాకతీయతో జిల్లాలో చెరువుల మరమ్మతులకు నిధులు కేటాయించారన్నారు. ఇటీవల వర్షాలతో పలు మండలాల్లో పంట నీట మునిగిందనీ, పంటనష్టంపై వ్యవసాయాధికారులతో వివరాలు నమోదు చేయించాలని సూచించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి అనీ, రైతు బీమా పథకం గొప్ప కార్యక్రమమని అన్నారు. రైతుబీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా ఇస్తుందన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నందున గోదావరికి జలకళ వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమనీ, అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా పనులు జరుగుతున్నాయనీ, ప్రాజెక్టు పూర్తయితే కరువులేని రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు రైతుల పేర్లు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులపై కాంగ్రెస్‌ నేతలు కపట ప్రేమ ఒలకబోయవద్దని హితవుపలికారు.

————