కార్పొరేట్లకు సాయం చేయండి – అరుణ్ జైట్లీ

arun-jaitley_pti_heroకార్పొరేట్లకు చేయూతనివ్వాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. విదేశీ పెట్టుబడులు దేశంలోకి ధారాళంగా వస్తున్నందున ప్రైవేట్‌రంగ పెట్టుబడులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ రంగానికి తగినంత సాయం రుణాల రూపంలో బ్యాంకులు అందించాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోకి పెట్టుబడులు వస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని, అందుకు బ్యాంకుల పాత్ర ప్రధానమని అన్నారు. శనివారం ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డెట్ రికవరీపై నిర్వహించిన సదస్సులో జైట్లీ మాట్లాడుతూ ‘పెట్టుబడుల విస్తరణలో ప్రైవేట్ రంగానికి కావాల్సిన మద్దతు బ్యాంకుల ద్వారా అందాలి. వృద్ధిరేటు బలోపేతం కావడానికి బ్యాంకుల పాత్ర కీలకం. కానీ అలా జరగడం లేదు.’ అన్నారు. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదన్న జైట్లీ మొండి బకాయిల సమస్యను ప్రస్తావించారు. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో గత కొనే్నళ్లుగా రుణాల మంజూరు మందగించిందన్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ అత్యంత అనువైనదిగా ఉండేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధానాలను సరళతరం చేస్తున్నామని జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పెట్టిన పెట్టుబడులకు విదేశీ మదుపరులు అధిక మొత్తంలో లాభాలను అందుకుంటున్నారని వివరించారు.