కాల్పులతో దద్దరిల్లిన ఢిల్లీ..

– గ్యాంగ్‌వార్‌లో ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు
న్యూఢిల్లీ, జూన్‌18(జ‌నం సాక్షి) : గ్యాంగ్‌ వార్‌తో దేశ రాజధాని దద్దరిల్లింది. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం రెండు గ్యాంగ్‌ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురారీలోని సంత్‌ నగర్‌కు చెందిన గోగి గ్యాంగ్‌, తిల్లు గ్యాంగ్‌ మధ్య సోమవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఇరు వర్గాలకు చెందిన దుండగులు తమ కార్లలో వెళ్తూ ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొన్నారు. ఆ తర్వాత రెండు గ్యాంగ్‌లు అక్కడి నుంచి పారిపోయాయి. ఉదయం 10గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వీరు కాల్పులకు పాల్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా.. మృతిచెందిన వారు ఏ గ్యాంగ్‌కు చెందిన వారో ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. పాత కక్షల వల్లే కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో
ఓ గ్యాంగ్‌ ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.