కాల్ డ్రాప్స్ తో డ్యామేజ్
ప్రకటనతోనే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో నెట్ వర్క్ ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కావట్లేదు. ఉచిత కాల్స్ ను ఆఫర్ చేసినప్పటికీ… విపరీతమైన కాల్ డ్రాప్స్ కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జియో నెట్ వర్క్ చేసిన ప్రచారానికి… మార్కెట్లో వినియోగం ప్రారంభమైన తర్వాత మాత్రం సీన్ ఛేంజ్ అయ్యింది. జియో నెట్వర్క్ ద్వారా ఇతర మొబైల్ కంపెనీలన్నింటికీ షాక్ ఇవ్వాలని ముఖేష్ అంబానీ భావించినప్పటికీ… ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. దీనికి కారణం రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా అన్ని నెట్ వర్క్ సంస్థలు ఒక్కటి కావటమే.
రిలయన్స్ త్రీ మంత్స్ వాయిస్ కాల్స్ అండ్ ఇంటర్ నెట్ ఫ్రీ సౌకర్యం కల్పించటంతో దేశంలో కోట్ల మంది ఈ నెట్ వర్క్ కు మారారు. దీంతో ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి సంస్థలకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా కంపెనీలకు వినియోగదారులు భారీగా తగ్గారు. దీన్ని గమనించిన నెట్ వర్క్ సంస్థలు రిలయన్స్ జియో కు ఝలక్ ఇస్తున్నాయి. ఆ కంపెనీ నుంచి వచ్చే కాల్స్ ను ఇతర నెట్ వర్క్ సంస్థలు కనెక్ట్ చేయటం లేదు. ఫలితంగా వందకు 90 శాతం కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. ఈ పరిణామం రిలయన్స్ జియో వినియోగదారులకు చిరాకు కలిగిస్తోంది.
జియో నెట్ వర్క్ కు కూడా రోజుకు లక్షల సంఖ్యలో కాల్ డ్రాప్స్ పై ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం ముఖేష్ అంబానీ రంగంలోకి దిగారు. ఎయిర్ టెల్ సహా ఐడియా, వోడాఫోన్ సంస్థలు తమ కాల్స్ ను కనెక్ట్ చేయటం లేదని ఆయన ట్రాయ్ కు ఫిర్యాదు చేశారు. ఐతే, ఇతర నెట్ వర్క్ సంస్థలు మాత్రం జియో వాదనను ఖండిస్తున్నాయి. కాల్ డ్రాప్స్ తో తమకు సంబంధం లేదని చెబుతున్నాయి. నెట్ వర్క్ సంస్థల మధ్య పోటీ కారణంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాయ్ జోక్యంతో త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని జియో భావిస్తోంది.