కాళేశ్వరానికి రూ.20వేల కోట్లివ్వండి

 కొత్త జోనల్‌ వ్వవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించండి

రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయండి

ప్రధాని మోదీకి సమస్యల చిట్టాను వివరించిన సీఎం కేసీఆర్‌

పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించిన కేసీఆర్‌

సానుకూలత వ్యక్తం చేసిన మోదీ

సుమారు 50 నిమిషాల పాటు మోదీ, కేసీఆర్‌ల మధ్య చర్చ

న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 20వేల కోట్లు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. శుక్రవారం ప్రధాని మోదీని కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా సుమారు 50 నిమిషాల పాటు వీరి బేటీ సాగింది. ఈ సమావేశంలో విభజన చట్టం హావిూలతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి 10 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి కేసీఆర్‌ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.20వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని విన్నవించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, సెక్రటేరియట్‌ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం(బైసన్‌ పోలో గ్రౌండ్‌) కేటాయింపు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదల, ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్‌కు నిధులు, కరీంనగర్‌లో ఐఐఐటి ఏర్పాటు, కొత్త జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తదితర అంశాలపై ప్రధానమంత్రికి సీఎం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని, .80 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు మంచినీటికి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీరు లభిస్తుందని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా కేటాయించిన నిధులు రూ. 25 వేల కోట్లతో పాటు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ. 22 వేల కోట్ల రుణం కూడా పొందామని, ఇంకా నిధుల అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి, రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాల నియామకానికి సంబంధించి పాత జోనల్‌ విధానమే కొనసాగుతున్నది. ఆర్టికల్‌ 371డి ఇంకా అమలవుతున్నది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో 6 జోన్ల వ్యవస్థ ఉండేది. తెలంగాణలో 5, 6 జోన్లు ఉన్నాయని కేసీఆర్‌ ప్రధానికి వివరించారు. మిగతావి ఆంధప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం కల్పించడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జోనల్‌ వ్యవస్థలో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, కాబట్టి దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించగలరని మనవి చేస్తున్నామన్నారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో పాటు అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థల విభజన పూర్తయినా, హైకోర్టువిభజన మాత్రం పూర్తి కాలేదన్నారు. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్నదని, తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు తమ హైకోర్టు తమకుండాలని బలంగా కోరుకుంటున్నామన్నారు. హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే, అందులో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణకు చెందిన వారున్నారు. 60:40 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ న్యాయమూర్తులు ఉండాల్సివుండగా, అదీ అమలు కాలేదు. కాబట్టి విూరు జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేలా చూడాలని ప్రధానిని సీఎం కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే లైన్లు జాతీయ సగటు కన్నా చాలా తక్కువగా ఉన్నాయని, తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైను నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ఈ లైను నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రధానిని సీఎం కోరారు. అక్కన్నపేట్‌-మెదక్‌ రైల్వే లైను నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయిందని, ఈ లైను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మించాలని కోరుతున్నామని, కాజీపేట-విజయవాడల మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం-మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌ మధ్య బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ నిర్మాణం చేపట్టాలని, సికింద్రాబాద్‌-మహబూబ్‌ నగర్‌, సికింద్రాబాద్‌-జహీరాబాద్‌ రైల్వే లైన్లను డబుల్‌ లేన్‌గా మార్చడానికి, హుజురాబాద్‌ విూదుగా కాజీపేట-కరీంనగర్‌ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించాలని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్‌ పోలో గ్రౌండ్‌ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను కోరామని, ఆ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించేలా చూడాలని సీఎం కోరారు. అదేవిధంగా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల(ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాల్సివుందని, కానీ, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదని కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ప్రధానిని సీఎం కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం 2013 సంవత్సరంలో హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజన్‌(ఐటిఐఆర్‌) మంజూరు చేసిందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను కూడా సమర్పించిందని, కానీ హైదరాబాద్‌లో ఐటిఐఆర్‌ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నట్లు పత్రికల్లో చదివామని,ఐదేళ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని, కాబట్టి ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్‌లో ఐటిఐఆర్‌ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్‌ పట్టణంలో ఐఐఐటిని స్థాపించాలని, దీనికి సంబంధించి స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే హైదరాబాద్‌లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయని, వరంగల్‌లో నిట్‌ ఉందని, కరీంనగర్‌ నగరంలోఐఐఐటి స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింత విస్తృతం చేసే అవకాశం ఉంటుందని దీనిపై దృష్టిసారించాలని ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ప్రతి జిల్లాకు ఒక జవహర్‌ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుందని, తెలంగాణలో ఇటీవలే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, రంగారెడ్డి, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, సిద్ధిపేట, ఖమ్మం, కరీంనగర్‌, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం నవోదయ విద్యాలయాలున్నాయని, మిగతా జిల్లాలైన ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 50నిమిషాల పాటు జరిగిన చర్చలో కేసీఆర్‌ లేవనెత్తిన సమస్యలపై ప్రధాని సావదానంగా విన్నారు. వీటన్నింటి అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్‌కు ప్రధాని హావిూ ఇచ్చారు.